Friday, November 4, 2011

ఎందరో మహానుభావులు అందరికి వందనములు - II

నిన్న నేను వ్రాసిన టపాలో జంధ్యాలగారిని గూర్చి వ్రాయటం ఎలా మరిచిపోయానో అర్ధం కావటం లేదు. కె. విశ్వనాథ్ గారి గూర్చి వ్రాస్తూ జంధ్యాల గారిని గూర్చి వ్రాయలనుకుంటూనే సినిమా లోకం నుంచి సినిమేతర లోకంలోకి వెళుతూ మరిచిపోయాను. ఇది కూడా ఒకందుకు మంచినే చేకూర్చింది. ఆ టపాకు రెండవ శీర్షకను వ్రాసే అవకాసం నాకు దొరికింది.
మొదట హాస్య బ్రహ్మ జంధ్యాల గారిని గూర్చి వ్రాయాలి. అచ్చ తెలుగులో అందరిని కడుపుబ్బా నవ్వించడం అయానకే చెల్లింది. "అసలు నేను తాజ్ మహల్ ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా!" ప్రేక్షకులను నవ్విస్తూనే ఎన్నో సున్నితమైన విషయాలు తెలియచేస్తూ, సామాజిక స్పృహతో కూడిన చిత్రాలను వారు తీసారు. అందుకు తెలుగుజాతి  వారంతా ఆయనకు ఋణగ్రస్తులు. వారు 50 ఏళ్లకే స్వర్గస్తులవటం తెలుగు సినీ లోకానికి, ముఖ్యంగా హాస్య లోకానికి తీరని నష్టం కలిగించింది.

జంధ్యాల  పేరు వచ్చింది కాబట్టి కరుణశ్రీగా ప్రఖ్యాతి గాంచిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని, వారి పుష్ప విలాపంని  ఇక్కడ స్మరించ తలిచాను.
ఈ మధ్య కాలంలో వచిన్న సినీదర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాసుగారు, శేఖర్ కమ్ములగారు, శ్రీను వైట్ల నాకు చాల ఇష్టం. అదే విదంగా జాగర్లముడి రాధాకృష్ణ, దేవ కట్ట వంటి వారంటే కూడా నాకు చాలా అభిమానం. అదే విధంగా పాటల రచియిత అనంత్ శ్రీరాం కూడా నాకు మిక్కిలి మక్కువ.

నేను స్కూల్లో ఉన్నప్పుడు అష్టావధానం గూర్చి ఒక పాఠం చదువుకున్నాను. అవధానం అనే సాహిత్య ప్రక్రియ సంస్కృత, తెలుగు భాషలలోన మాత్రమే విస్తృతంగా ఉనట్టు ఉంది/ఉండేది. ఇందులో అష్టావధానం చాలా విరివిగా ఉన్నప్పటికీ మనకు శతావాధనులు, సహస్రావధానులు కూడా ఉన్నారు/ఉండేవారు. తిరుపతి వెంకట కవులు అష్టావధానానికి బాగా ప్రాశస్త్యం తెచ్చినట్టు నాకు ఈ రోజు తెలిసింది. నాటక రంగంలో "బావా ఎప్పుడు వచ్చితివి?...",    "జెండాపై కపిరాజు..." వంటి పద్య రత్నాలు వారు ఇచ్చారనే విషయం మాత్రమే నాకు ఇదివరకు తెలుసు. 

ఇంకా ఎందరో మహానుభావులు. నాటి ఆదికవి నన్నయనుంచి నేటి తరం వారి వరకు తెలుగు భాషకు వన్నె తెచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ శతసహస్రవందనాలు.
   

Thursday, November 3, 2011

ఎందరో మహానుభావులు అందరికి వందనములు


నాకు తెలుగు భాష పట్ల ఆసక్తిని తెలుగు సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ఆస్వాదించే అవకాశాన్ని ఇచ్చిన  మహానుభావులు ఎందరో. వారందరకి శతసహస్రవందానాలు. ఉడతా భక్తిగా నా వంతు కొన్ని వాక్యాలు
సినిమాలు హిట్లు అవుతాయి; ఫ్లాప్ అవుతాయి. అది ఆర్ధిక శాస్త్రం ప్రకారం వేసే లెక్క. చిత్రాలలో మంచి చిత్రాలు, చాల మంచి చిత్రాలు, ఎప్పటికీ నిలిచిపోయే చిత్రాలు కొన్ని వుంటాయి.  ఇది రసజ్ఞులు వేసుకొనే లెక్క. ఎప్పటికి నిలిచిపోయే చిత్రాలు అందించిన  కాశినాధుని విశ్వనాథ్ గారికి నా ధన్యవాదాలు.
నేను శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారి వీరాభిమానిని. పూర్తిగా ఆంగ్లంలో కొట్టిమిట్టడుతున్న నేను మేలుకొని తెలుగు మళ్ళీ నేర్చుకోవడం మొదలుపెట్టిందే వారి పాడుతా తీయగా  కార్యక్రమము వలన. వారికి నిండు నూరేళ్ళు; కాదు కాదు నూట ఇరవై ఏళ్లు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారు ఈ కొత్త తరానికి చూపిస్తున్న దారిలో సాధ్యమైనంత మంది నడవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ఆచార్య ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, వేటూరి సుందరరామమూర్తి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇందులో ముఖ్యంగా  వేటూరి గారిని, సీతారామ శాస్త్రి గారిని చూసి నేను చాల స్పూర్తి చెందాను. వీరందరి పాటలలో మానవాళి యొక్క మనగుడలోని జీవిత సత్యాలు అక్షరాల అలంకరణతో అందంగా అందరిని అలరిస్తాయి.
ఇక శ్రీశ్రీ గారు. బాలు గారికి నేను పెరిగి పెద్దవాడినయిన తరువాత వీరాభిమాని అయితే, వీరికి చిన్నపట్టినుంచే వీరభిమానిని. నాలాగే వీరికి మరో వీరాభిమాని,  నాకు చాలా సన్నిహితుడైన మిత్రుడొకడు ఉన్నాడు. మేము కళాశాలో చదువుకొనే రోజులలో, వారి కవితలు నా చేత చదివించి వినేవాడు. వాడికి నేను అవి భాగా చదివే వాడినని అని అభిప్రాయం. అదే నాకు చాల గర్వ కారణం. శ్రీ శ్రీ గారు నేను సైతం అంటూ మన జాతికిచ్చిన స్పూర్తి చిరస్మరణీయం.        
ఏంతో సాహసంతో ఈ టప వ్రాయడం మొదలు పెట్టిన నాకు ఇప్పుడు భయం వేస్తోంది. పోతానామాత్యుల పద్యాలూ చదివేటప్పుడు నాకు మతి ఎంత చలిస్తుందో నేను మాటలలో చెప్పలేను. అంత గొప్పవారి గురించి నేను వ్రాస్తే కించపరిచినట్టు అవుతుందేమో అని ఒక చిన్న భయం. కాని వారు వ్రాసిన ఆంధ్రమహభాగవతంలోని  కనీసం ఒక్క పద్యం కూడా తెలియని ఎందరో తెలుగు వారు వున్నారని, వారిలో ఒక్కరైన నా ప్రయత్నం వల్ల తెలుసుకుంటారేమోననే అత్యాశ.  అదే కోవలోకి చెందినా వారు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు మరియు త్యాగరాజ స్వామి వారు. వారి గురించే వ్రాసే అర్హత నాకు లేదు కనుక వారిని కేవలం స్మరించు కొని వారికి మరొక్కసారి శతసహస్ర వందనాలు తెలియచేసుకుంటున్నాను. అసలు ఒక వ్యక్తి తన జీవిత పరిమాణంలో 35000 కీర్తనలు ఎలా వ్రాసాడో నాకు తల కిందులుగా తపస్సు చేసిన అర్ధం కాదు.    
ఇక వేమన, బద్దెన, గోపన్న మొదలగు వారు. వారి శతకాల గూర్చి కూడా మాట్లాడే అర్హత నాకు లేదు. శ్రీ కృష్ణదేవరాయలు, వారి భువన విజయము, అష్ట దిగ్గజాలు, ముఖ్యంగా తెనాలి రామకృష్ణులు, అల్లసాని పెద్దన చిరస్మరణీయులు. తెలుగు భాష ఆది కవి అయిన నన్నయ మొదలగు వారిని గూర్చి కూడా నాకు  వ్రాసే అర్హత లేదని భావిస్తున్నాను.
ఎక్కడో పుట్టి ఇక్కడికి వృత్తిరీత్యా వచ్చి తెలుగు భాష నిఘంటువుని మనకు అందించిన C.P.Brownకు మనమేల్లరము సర్వదా ఋణగ్రస్తులం.
ఎందరో మహానుభావులు అందరికి వందనములు.